Tuesday, December 8, 2015

తెలుసా…

వర్షమంతా వచనంగా మారిపోయాక
పొడిబారి ఆకాశం పొందిగ్గా నవ్వుకున్నాకా
తడి అంటని స్పర్శల్లో
ఇక మిగిలినవన్నీ క్రోడీకరింపబడిన భావాలే

నాకిష్టమైనదేవిటో
స్పష్టపరచలేకపోతున్న బాధనంతా
నా గది గోడలపైన చిత్రించుకున్నాక
నా ఆనందాలన్నీ
ఆ రంగుల్లో మెరిసే నా ఊహలే
నా ఏకాంతాలన్నీ
మదిలోపలి పుస్తకంలో
పద్యాలుగా రాసిపెట్టుకున్నాక
అక్షరాలన్నీ నవ్వించే చంద్రవంకలే

నీతో మాట్లాడటమంటే ...

నీతో మాట్లాడటమంటే
పూలు వికసించే దారిలో నడవడం
నీ మాటల్లో సీతాకోకచిలుకలు
పుప్పొడిని వాక్యాంతాలుగా చల్లుతుంటే
అలా నేనో ఆశ్చర్యార్థకాన్నైపోవడం

నిన్ను వింటున్నంతసేపూ
లోపల సుడులు తిరుగుతున్న సంగీతం
నన్ను తనలోకి లాక్కున్నాక
నేనో పూవునై కోటి రేకులతో విచ్చుకోవడం

Monday, September 7, 2015

కొమ్మల మధ్యన



ఇలా వచ్చి వెళ్ళిపోతావ్. లిప్త కాలమే అయినా, నీ నీడ పడిన ప్రతి చోటా నీ నవ్వు రంగులో పదం పూయడం విస్మయంగా చూస్తూ నిలబడిపోతాను.
గంభీరమైన మేఘం, హృదయాన్ని ముద్దాడి, ప్రవాహమై, మమేకమై, నేల చేరిపోయినా, ఆర్తిగా పిలిచే ఆకాశం కోసం మళ్ళీ మళ్ళీ జన్మిస్తూనే ఉన్నట్టు, పూసిన ప్రతిసారీ వెతికి మరీ జీవితాల్ని కలుపుతూ విస్తరిస్తున్న వలపు దారపు కొలత మనకి అవ్యక్తమో అపరిచితమో కాదని నీకూ తెలుసు.
కాలాన్ని గడ గడా తాగుతూ ఉంటారెవరో
సముద్ర వేదన తీర్చాలని వెర్రిగా ప్రయత్నించిన రోజుల్లో ఎప్పుడో ఒకసారి నాకు దొరికిన శంఖాన్ని చెవికానించుకుని నా ఏకాంతాన్ని సవరించుకుంటానో లేదో, నేను పాడిన అదే పాట ఇప్పుడు అంతులేని కథలా మళ్ళీ చెవిలో ఇలాఅందులో మన పేర్లు కూడా వినపడి, తిరిగి ఆ భాషని ఆ ఇసుకలోనే గవ్వలుగా  చల్లేసి పోవాలని ప్రయత్నిస్తూ ఎంత సేపు ఉండిపోతానో తెలీదు.
అకస్మాత్తుగా రెక్కలొస్తాయ్. సమాధానాలన్నిటినీ పొదవుకుని తెల్లటి జాగాలో జారవిడిచి రాకుండా, ప్రశ్నల్లోనే తప్పుల్ని లెక్కిస్తూ ఉండిపోయానని, రాలిపోయిన రెక్కల్ని జాలిగా చూస్తూ రంగు మార్చుకుంటుంది సమయం.
ఖాళీ ఐన మట్టిముంతలో క్షణాల్ని చిలికే ప్రయత్నం చేస్తూంటారెవరో
ఎవరెంత చెప్పినా, ఎవరెన్ని రాసినా, దారి కాచి చీకటిని దోచుకుంటూ దగా చేసే కలల్ని నేనెప్పుడూ నమ్మను. మళ్ళీ నువ్వొచ్చేవరకూ కంట్లోనే ఇరుక్కుపోయిన నీ రూపమొక్కటే నా కోసం కాలాన్ని వడగడుతుంది తెలుసా.

రాధా మనోహరం ...




రాధ ఉలిక్కిపడింది. తననెవరో గుసగుసగా పిలిచిన భావన. చాలా దగ్గరగా వచ్చిపిలిచినట్టు. చెవి పక్కన చెంపల మీదుగా జారి ఒంపు తిరిగిన కురులు కూడా చిన్నగా వణికాయ్.
అప్పటివరకూ నల్లనయ్యను తలుచుకుంటూ , కూనిరాగాలు తీస్తూ చిలికిన వెన్న జాగ్రత్తగా మట్టి కుండలోకి తీసిపెడుతున్నదల్లా రెపరెపలాడుతున్న హృదయంతో తలెత్తి చుట్టూ చూసింది. ఎవరూ లేరుఎప్పటిలాగే ఉన్నాయ్ పరిసరాలు. 
తిరిగి తన పనివైపు దృష్టి సారించింది కానీ ఏదో అలజడి మనసంతా. ఆమెకు తెలీకుండానే అంతకంతకూ వేగవంతమవుతూ ఎదని ఊయలూపుతోంది ఊపిరి. బుగ్గలు బరువెక్కి , ఎరుపెక్కి ఏదో పరవశం పెదవుల్లోకి కూడా పాకి వణికిస్తోంది.
త్వరగా పని ముగించుకుని ముందు గదిలోకి వెళ్ళి గుమ్మానికానుకుని నిలబడి ఆకాశం వైపు చూసింది. నిండు చంద్రుడు కొంటెగా నవ్వుతున్నట్టుగా అనిపించింది. ఏవిటో అర్ధంకాలేదు. ఇప్పుడే.. క్షణంలోనే నల్లనయ్యని చూడాలని ఆమె మనసు ఉవ్విళ్ళూరింది. కానీ ఎలా? సమయంలో వెళితే అమ్మ ఏమంటుందో. తల తిప్పకుండానే ఓరగా తల్లి వైపు చూసింది. చుట్టుపక్కల వారితో కలిసి ముచ్చట్లలో ఉందావిడ.
తిరిగి ఆకాశం వైపు చూసింది. అంతవరకూ లేనిది ఎక్కడి నుండి వచ్చాయో నల్లమబ్బులు. వేగంగా కదిలిపోతున్నాయ్. అప్పటిదాకా వెన్నెల్లో వెలిగిపోయిన పరిసరాలన్నీ కృష్ణవర్ణాన్ని పులుముకుని ఆమెకేదో చెప్పాలని చూస్తున్నట్టుగా అనిపించాయ్. చల్లటి గాలి తనువుని తాకి ఆమె పరిస్థితిని మరింతగా దిగజారుస్తోంది. ఎక్కడెక్కడి పూల పరిమళాలనో పట్టుకొచ్చి గాలి ఆమెని సాంత్వన పరచాలని చూసింది కానీ, ఆమె పరిస్థితి మెరుగవలేదు.
ఎక్కడినుంచో సమ్మోహన వేణు గానం తనని పిలుస్తున్నట్టుగా వినపడింది. అంతే, ఇక ఆమె తన ఎరుకని మరిచిపోయింది. మెరుపు వేగంతో కదిలింది.
సమయంలో, వాతావరణంలో ఎక్కడికమ్మా …” అంటున్న తల్లి మాటలు రాధ చెవులకి వినపడలేదు.
రాధ తల్లి సరిగ్గా గమనించి ఉంటే రాధ అలా వెళ్ళడం వల్ల కదిలిన ఆమె జడ కుచ్చుల సవ్వడిలోనో, పద మంజీరాల కులుకుల్లోనో , పొడవాటి చెవి జూకాల ఊపులోనో ఆమెకి సమాధానం దొరికేసి ఉండేది.
ఏదో మాయ కమ్మినట్టుగా యమునా తీరంలోని పచ్చిక బయలుకేసి నదిలా కదిలింది రాధ.
ఆమె పరిమళాన్ని అల్లంత దూరంనుంచే ఆఘ్రాణించి లిప్త కాలంపాటు మురళీ గానాన్ని ఆపాడు కృష్ణుడు. అతని కళ్ళలో యమున వలపుగా మెరిసింది. చెంపల్లో తామరలు విచ్చుకుని రాలి ఒక విధమైన కెంపు మెరుపులతో ప్రదేశాన్ని వెలిగించాయ్.
పరుగులాంటి నడకతో అక్కడికి చేరుకున్న రాధ అలా కృష్ణుడిని చూస్తూనే శిలలా నిలబడిపోయింది. రెప్ప మరచిన ఆమె కన్నుల నీలిమల్లో చంద్రోదయాలయ్యాయి. అమె కళ్ళలోంచి దూకుతున్న వెన్నెల వెలుగు, విశ్వ మోహనుడి తనూ వర్ణంతో కలిసి ప్రదేశమంతా అలౌకికమైన, అవ్యక్తమైన వర్ణంతో శోభిల్లింది. అక్కడి నీరూ, చెట్టూ, చేమా, పూలూ , తుమ్మెదలూ అన్నీ పరవశంతో ఉలిక్కిపడ్డాయ్.
తన్మయంగా కృష్ణుడిని చూస్తూ నెమ్మదిగా నడిచి వెళ్ళి ఆతని ఒడిలో వాలిపోయింది రాధ. మానస మనోహరుడి కన్నుల్లోకి ప్రేమగా చూస్తూ అంది
నిన్ను చూడగానే నాలో కలిగే ప్రేమ
ప్రపంచాన్ని ముంచేసేలా విస్తరిస్తుంటే
కృష్ణా
కాలం కవిత్వమైపోయి
మనిద్దరి దేహాల మీదుగా ప్రవహిస్తున్నట్టు లేదూ… “